Deuteronomy 2 in Telugu

1 అప్పుడు యెహోవా నాతో చెప్పిన విధంగా మనం తిరిగి ఎర్రసముద్రం దారిలో ఎడారి గుండా చాలా రోజులు శేయీరు కొండ చుట్టూ తిరిగాం.

2 యెహోవా నాకు ఇలా చెప్పాడు. “మీరు ఈ కొండ చుట్టూ తిరిగింది చాలు,

3 ఉత్తరం వైపుకు వెళ్ళండి. నువ్వు ప్రజలతో ఇలా చెప్పు.

4 ‘శేయీరులో నివసించే ఏశావు సంతానమైన మీ సోదరుల సరిహద్దులు దాటి వెళ్లబోతున్నారు, వారు మీకు భయపడతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి.

5 వారితో కలహం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఏశావుకు శేయీరును స్వాస్థ్యంగా ఇచ్చింది నేనే. వారి భూమిలోనిది ఒక్క అడుగైనా మీకియ్యను.

6 మీరు డబ్బులిచ్చి వారి దగ్గర ఆహారం కొని తినవచ్చు. డబ్బులిచ్చి నీళ్లు కొని తాగవచ్చు.’

7 ఎందుకంటే మీ చేతి పని అంతటినీ మీ యెహోవా దేవుడు ఆశీర్వదించాడు. ఈ గొప్ప ఎడారిలో నువ్వు ఈ నలభై సంవత్సరాలు తిరిగిన సంగతి ఆయనకు తెలుసు. ఆయన మీకు తోడుగా ఉన్నాడు, మీకేమీ తక్కువ కాదు.”

8 అప్పుడు శేయీరులో నివసించే ఏశావు సంతానమైన మన సోదరులను విడిచి, ఏలతు, ఎసోన్గెబెరు, అరాబా దారిలో మనం ప్రయాణించాం.

9 మనం తిరిగి మోయాబు ఎడారి మార్గంలో వెళుతుండగా యెహోవా నాతో ఇలా అన్నాడు. “మోయాబీయులను బాధ పెట్టవద్దు. వారితో యుద్ధం చేయొద్దు. లోతు సంతానానికి ఆర్ దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాను. వారి భూమిలో దేనినీ నీ స్వంతానికి ఇవ్వను.”

10 గతంలో ఏమీయులు ఆ ప్రాంతాల్లో ఉండేవారు. వారు అనాకీయుల్లాగా పొడవైనవారు, బలవంతులైన గొప్ప ప్రజ. అనాకీయుల్లాగా వారిని కూడా “రెఫాయీయులు” అని పిలిచారు.

11 మోయాబీయులు వారికి “ఏమీయులు” పేరు పెట్టారు.

12 పూర్వకాలంలో హోరీయులు శేయీరులో నివసించారు. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశంలో చేసినట్టు ఏశావు సంతానం హోరీయుల దేశాన్ని స్వాధీనం చేసుకుని వారిని చంపి వారి దేశంలో నివసించారు.

13 “ఇప్పుడు మీరు లేచి జెరెదు వాగు దాటండి” అని యెహోవా ఆజ్ఞాపించగా మనం జెరెదు వాగు దాటాం.

14 మనం కాదేషు బర్నేయ నుండి బయలుదేరి జెరెదు వాగు దాటే వరకూ మనం ప్రయాణించిన కాలం 38 సంవత్సరాలు. యెహోవా వారితో శపథం చేసినట్టు అప్పటికి ఆ తరంలో యుద్ధం చేయగల మనుషులందరూ గతించిపోయారు.

15 అంతే కాదు, వారు గతించే వరకూ ఆ తరం వారిని చంపడానికి యెహోవా హస్తం వారికి విరోధంగా ఉంది.

16 ఈ విధంగా సైనికులైన వారంతా చనిపోయి గతించిన తరువాత యెహోవా నాకు ఇలా చెప్పాడు,

17 “ఈ రోజు నువ్వు మోయాబుకు సరిహద్దుగా ఉన్న ఆర్ దేశాన్ని దాటబోతున్నావు.

18 అమ్మోనీయుల పక్కగా వెళ్ళేటప్పుడు వారిని బాధించవద్దు.

19 వారితో యుద్ధం చేయొద్దు. ఎందుకంటే లోతు సంతానానికి దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాను. కాబట్టి వారి దేశంలో భూమిని నీకు ఏ మాత్రం ఇవ్వను.”

20 దాన్ని కూడా రెఫాయీయుల దేశం అని పిలిచారు. పూర్వం రెఫాయీయులు అందులో నివసించారు. అమ్మోనీయులు వారిని “జంజుమీయులు” అనేవారు.

21 వారు అనాకీయుల్లాగా పొడవైన వారు, బలవంతులైన గొప్ప ప్రజలు. అయితే యెహోవా అమ్మోనీయుల ఎదుట నుండి వారిని వెళ్లగొట్టడం వలన అమ్మోనీయులు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ నివసించారు.

22 ఆయన శేయీరులో నివసించే ఏశావు సంతానం కోసం వారి ఎదుట నుండి హోరీయులను నశింపజేశాడు కాబట్టి వారు హోరీయుల దేశాన్ని స్వాధీనం చేసుకుని ఈ రోజు వరకూ అక్కడ నివసిస్తున్నారు.

23 గాజా వరకూ ఉన్న గ్రామాల్లో నివసించిన ఆవీయులను కఫ్తోరు నుండి వచ్చిన కఫ్తోరీయులు నాశనం చేసి అక్కడ నివసించారు.

24 “మీరు బయలుదేరి అర్నోను లోయ దాటండి. ఇదిగో అమోరీయుడు, హెష్బోను రాజు అయిన సీహోనునూ అతని దేశాన్నీ మీ చేతికి అప్పగించాను. అతనితో యుద్ధం చేసి దాన్ని ఆక్రమించుకోండి.

25 ఈ రోజు ఆకాశం కింద ఉన్న జాతుల ప్రజలందరికీ నువ్వంటే భయం పుట్టించడం మొదలు పెడుతున్నాను. వారు మీ గురించిన సమాచారం విని నీ ఎదుట వణకి, కలవరపడతారు” అని యెహోవా నాతో చెప్పాడు.

26 అప్పుడు నేను కెదేమోతు ఎడారిలో నుండి హెష్బోను రాజు సీహోను దగ్గరికి దూతలను పంపి

27 “మమ్మల్ని నీ దేశం గుండా వెళ్ళనివ్వు. కుడి, ఎడమలకు తిరగకుండా దారిలోనే నడిచిపోతాము.

28 నా దగ్గర సొమ్ము తీసుకుని తినడానికి ఆహార పదార్థాలు, తాగడానికి నీరు ఇవ్వు.

29 శేయీరులో ఏశావు సంతానమూ ఆర్ లో మోయాబీయులూ నాకు చేసినట్టు, మా దేవుడు యెహోవా మాకిస్తున్న దేశానికి వెళ్ళడానికి యొర్దాను నది దాటేవరకూ కాలి నడకతోనే మమ్మల్ని వెళ్లనివ్వు” అని శాంతికరమైన మాటలు పలికించాను.

30 అయితే హెష్బోను రాజు సీహోను మనం తన దేశం గుండా వెళ్లడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ రోజు జరిగినట్టుగా మన చేతికి అతణ్ణి అప్పగించడం కోసం మీ యెహోవా దేవుడు అతని మనస్సును కఠినపరచి అతని హృదయాన్ని బండబారిపోయేలా చేశాడు.

31 అప్పుడు యెహోవా “చూడు, సీహోనును అతని దేశాన్ని నీకు అప్పగిస్తున్నాను. అతని దేశాన్ని స్వాధీనం చేసుకోవడం మొదలు పెట్టు” అని నాతో చెప్పాడు.

32 సీహోనూ అతని ప్రజలంతా యాహసులో మనతో యుద్ధం చేయడానికి వచ్చారు.

33 మన యెహోవా దేవుడు అతణ్ణి మనకప్పగించాడు కాబట్టి మనం అతన్నీ అతని కొడుకులనూ అతని ప్రజలందరినీ చంపివేశాం.

34 అప్పుడున్న అతని పట్టణాలనూ, వాటిలోని స్త్రీ పురుషులనూ పిల్లలనూ ఏదీ మిగలకుండా నాశనం చేశాం.

35 కేవలం పశువులనూ ఆ పట్టణాల ఆస్తినీ దోచుకున్నాం.

36 అర్నోను ఏటిలోయ ఒడ్డున ఉన్న అరోయేరు, ఆ లోయలో ఉన్న పట్టణం మొదలుపెట్టి గిలాదు వరకూ మనకు లొంగిపోని పట్టణం ఒక్కటి కూడా లేదు. మన దేవుడు అన్నిటినీ మనకి అప్పగించాడు.

37 అయితే అమ్మోనీయుల దేశానికైనా, యబ్బోకు నది లోయలోని ఏ ప్రాంతానికైనా ఆ కొండప్రాంతంలోని పట్టణాలకైనా మన యెహోవా దేవుడు వెళ్ళవద్దని చెప్పిన మరే స్థలానికైనా మీరు వెళ్ళలేదు.