Psalm 37 in Telugu

1 దావీదు కీర్తన చెడ్డ వారిని చూసి నువ్వు క్షోభపడకు. అధర్మంగా ప్రవర్తించే వాళ్ళని చూసి అసూయ పడకు.

2 ఎందుకంటే వాళ్ళు గడ్డిలాగా త్వరలోనే ఎండిపోతారు. పచ్చటి మొక్కల్లా వాడి పోతారు.

3 యెహోవాలో నమ్మకం ఉంచు. ఏది మంచిదో దాన్నే చెయ్యి. దేశంలో స్థిరపడి విశ్వసనీయతను ఆచరించు.

4 తర్వాత యెహోవాలో ఆనందించు. నీ హృదయంలోని ఆశలన్నిటినీ ఆయన తీరుస్తాడు.

5 నీ జీవిత గమనాన్ని యెహోవాకు అప్పగించు. ఆయనలో నమ్మకముంచు. ఆయన నీ తరుపున పని చేస్తాడు.

6 పగటి వెలుగులా నీ న్యాయవర్తననూ, మధ్యాహ్నపు వెలుగులా నీ నిర్దోషత్వాన్నీ ఆయన చూపిస్తాడు.

7 యెహోవా ఎదుట మౌనంగా ఉండు. సహనంతో ఆయన కోసం వేచి ఉండు. దుర్మార్గాలు చేసి ఎవరన్నా విజయం సాధిస్తే చింతించకు. ఎవరన్నా కుట్రలు చేస్తే విచారించకు.

8 కోపపడకు. నిరుత్సాహపడకు. చింతపడకు. దానివల్ల సమస్యలు కలుగుతాయి.

9 దుర్మార్గకార్యాలు చేసే వాళ్ళు నిర్మూలం అవుతారు. కానీ యెహోవా కోసం వేచి చూసే వాళ్ళు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.

10 ఇక కొద్ది కాలంలోగా దుర్మార్గుడు లేకుండా పోతాడు. అతడున్న స్థలాన్ని నువ్వు ఎంత వెదికినా అతడు కనిపించడు.

11 నమ్రత గలవాళ్ళు భూమిని స్వాధీనం చేసుకుంటారు. గొప్ప సమృద్ధి కలిగి సంతోషిస్తారు.

12 దుష్టుడు ధర్మాత్ముడికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తాడు. వాడు అతనికి విరోధంగా పళ్ళు కొరుకుతాడు.

13 వాళ్ళ సమయం అయిపోవచ్చింది కాబట్టి ప్రభువు వాళ్ళను చూసి నవ్వుతాడు.

14 అణచివేతకి గురైన వాళ్ళనీ పేదలనీ నిరుత్సాహపరచడానికీ, నిజాయితీగా ఉండేవాళ్ళనీ చంపడానికీ దుష్టులు తమ కత్తులు దూశారు. తమ విల్లును వంచారు.

15 వాళ్ళ కత్తులు వాళ్ళ గుండెల్నే చీల్చివేస్తాయి. వాళ్ళ విల్లులు విరిగిపోతాయి.

16 దుష్టుల దగ్గర ఉన్న సమృద్ధి కంటే ధర్మాత్ముడి దగ్గర ఉన్న కొంచెమే శ్రేష్ఠమైనది.

17 దుష్టుల చేతులు విరిగిపోతాయి. కానీ యెహోవా ధర్మాత్ములను కాపాడతాడు.

18 యెహోవా నిందారహితులను ప్రతిరోజూ కనిపెట్టుకుని ఉంటాడు. వాళ్ళ వారసత్వం నిత్యమూ ఉంటుంది.

19 రోజులు బాగా లేనప్పుడు వాళ్ళకు అవమానం కలగదు. కరువు కాలంలో వాళ్ళకు చాలినంత ఆహారం ఉంటుంది.

20 అయితే దుష్టులు నశించిపోతారు. యెహోవా విరోధుల కీర్తి పచ్చిక బయళ్ళ చందంగా ఉంటుంది. వాళ్ళు సమసిపోయి పొగలాగా కనిపించకుండా పోతారు.

21 దుష్టులు అప్పు చేస్తారు, కానీ తిరిగి చెల్లించరు. కానీ ధర్మాత్ములు దయతో దానం చేస్తారు.

22 యెహోవా ఆశీర్వదించిన వాళ్ళు భూమిని స్వాధీనం చేసుకుంటారు. ఆయన ఎవరినైతే శపిస్తాడో వాళ్ళు నాశనమౌతారు.

23 దేవుని దృష్టిలో ఏ వ్యక్తి మార్గం కొనియాడదగ్గదిగా ఉందో ఆ వ్యక్తి నడతను యెహోవా స్థిరపరుస్తాడు.

24 యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కాబట్టి అతడు తన మార్గంలో తడబడినా కిందపడడు.

25 నేను ఒకప్పుడు చిన్నవాడిగా ఉన్నాను. ఇప్పుడు పెద్దవాణ్ణి అయ్యాను. అయితే నీతిమంతుడు అనాథ కావడం గానీ, లేదా అతడి పిల్లలు అడుక్కోవడం గానీ నేను చూడలేదు.

26 అతడు రోజంతా దయతో అప్పులిస్తూ ఉంటాడు. అతని పిల్లలు ఆశీర్వాదంగా ఉంటారు.

27 చెడు నుండి మళ్ళుకో. ఏది మంచిదో దాన్ని చెయ్యి. అప్పుడు నువ్వు కలకాలం సురక్షితంగా ఉంటావు.

28 ఎందుకంటే యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు. విశ్వాసంతో తనను అనుసరించే వాళ్ళను ఆయన విడిచిపెట్టడు. వాళ్ళను శాశ్వతంగా భద్రపరుస్తాడు. అయితే దుర్మార్గుల సంతానం నాశనం అవుతుంది.

29 నీతిమంతులు భూమిని స్వాధీనం చేసుకుంటారు. అక్కడ వాళ్ళు కలకాలం జీవిస్తారు.

30 నీతిమంతుని నోరు జ్ఞానాన్ని పలుకుతుంది. అది న్యాయాన్ని అధికం చేస్తుంది.

31 అతని హృదయంలో అతని దేవుని ధర్మశాస్త్రం ఉంది. అతని అడుగులు జారవు.

32 దుర్మార్గుడు ధర్మాత్ముణ్ణి గమనిస్తూ ఉంటాడు. అతణ్ణి చంపడానికి చూస్తూ ఉంటాడు.

33 అయితే యెహోవా అతణ్ణి దుష్టుడి చేతిలో వదిలిపెట్టడు. అతనికి తీర్పు జరిగే సమయంలో నేరం మోపడు.

34 యెహోవా కోసం వేచి ఉండు. ఆయన మార్గాన్ని అనుసరించు. భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఆయన నిన్ను లేపుతాడు. దుర్మార్గులు నిర్మూలమైనప్పుడు నువ్వు చూస్తావు.

35 భీకరుడైన దుర్మార్గుడు స్వంత నేలలో పెరిగిన చెట్టులా విస్తరించడం నేను చూశాను.

36 అయితే నేను ఆ దారిన వెళ్ళినప్పుడు నేను వాడి కోసం చూశానుగానీ వాడు నాకు కనిపించలేదు.

37 చిత్తశుద్ధి కలిగిన వ్యక్తిని గమనించు. యథార్ధంగా ఉండే వాణ్ణి కనిపెట్టు. శాంతి కోసం జీవించేవాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది.

38 పాపులు సమూలంగా నాశనం అవుతారు. దుర్మార్గుడికి భవిష్యత్తు ఉండదు.

39 నీతిపరులకు యెహోవా దగ్గరనుండే ముక్తి కలుగుతుంది. వేదన సమయంలో ఆయన వాళ్ళను కాపాడతాడు.

40 యెహోవా వాళ్ళని దుర్మార్గుల బారినుంచి రక్షిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఆయనలో ఆశ్రయం పొందారు.