Numbers 17 in Telugu

1 యెహోవా మోషేతో మాట్లాడుతూ,

2 “నువ్వు ఇశ్రాయేలీయులతో మాట్లాడు, వారి దగ్గర ఒక్కొక్క పితరుల వంశానికి ఒక్కొక్క చేతికర్ర చొప్పున, అంటే ప్రతి వంశానికి చెందిన వారి నాయకుని దగ్గరనుంచి తమ తమ వంశాల ప్రకారం 12 చేతికర్రలు తీసుకుని ఎవరి చేతికర్ర మీద వారి పేరు రాయి.

3 లేవీ చేతికర్ర మీద అహరోను పేరు రాయాలి. ఎందుకంటే ఒక్కొక్క పితరుల వంశాల నాయకునికి ఒక్క చేతికర్రే ఉండాలి.

4 నేను మిమ్మల్ని కలుసుకునే సన్నిధి గుడారంలోని నిబంధన శాసనాల ముందు వాటిని ఉంచాలి.

5 అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుంటానో, అతని కర్ర చిగురిస్తుంది. ఇశ్రాయేలీయులు మీకు విరోధంగా చేస్తున్న ఫిర్యాదులు నాకు వినిపించకుండా ఆపేస్తాను” అన్నాడు.

6 కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పినప్పుడు వారి నాయకులందరూ తమ తమ పితరుల వంశాల్లో ఒక్కొక్క నాయకునికి ఒక్కొక్క కర్ర ప్రకారం 12 కర్రలు అతనికిచ్చారు. అహరోను కర్ర కూడా వారి కర్రల మధ్యలో ఉంది.

7 మోషే, వారి కర్రలను నిబంధన శాసనాల గుడారంలో యెహోవా సన్నిధిలో పెట్టాడు.

8 తరువాత రోజు మోషే నిబంధన శాసనాల గుడారంలోకి వెళ్లి చూసినప్పుడు లేవీ వంశానికి చెందిన అహరోను కర్ర మొగ్గ తొడిగి ఉంది. అది మొగ్గలు తొడిగి, పూలు పూసి, పండిన బాదం కాయలు కాసింది.

9 మోషే యెహోవా సన్నిధిలోనుంచి ఆ కర్రలన్నీ ఇశ్రాయేలీయులందరి ఎదుటకు తెచ్చినప్పుడు వారు వాటిని చూసి ఒక్కొక్కరూ ఎవరి కర్ర వారు తీసుకున్నారు.

10 అప్పుడు యెహోవా మోషేతో “అహరోను కర్రను నిబంధన శాసనాల ఎదుట శాశ్వతంగా ఉంచు. అలా చేస్తే, అది తిరుగుబాటు చేసిన వారి అపరాధానికి గుర్తుగానూ, నాకు విరోధంగా సణిగి ఎవ్వరూ చనిపోకుండా ఉండడానికీ వీలౌతుంది” అన్నాడు.

11 అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు, అతడు కచ్చితంగా అలాగే చేశాడు.

12 అయితే ఇశ్రాయేలీయులు మోషేతో “మేము ఇక్కడ చనిపోతాం. మేమందరం నశించిపోతాం!

13 యెహోవా మందిరాన్ని సమీపించిన ప్రతిఒక్కరూ చనిపోతారు. మేమందరం చావాల్సిందేనా?” అన్నారు.