Joshua 13 in Telugu

1 యెహోషువ వయసు మళ్ళిన వృద్ధుడు అయ్యాడు. యెహోవా అతనితో ఇలా చెప్పాడు. “నీవు బాగా వృద్ధుడివయ్యావు. స్వాధీనం చేసుకోడానికి ఇంకా అతి విస్తారమైన దేశం మిగిలి ఉంది.

2 ఆ ప్రాంతాలేవంటే, ఫిలిష్తీయుల ప్రదేశాలన్నీ గెషూరీయుల దేశమంతా ఐగుప్తుకు తూర్పున ఉన్న షీహోరు నుండి

3 కనానీయులవైన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకూ, ఫిలిష్తీయుల ఐదుగురు సర్దారులకు సంబంధించిన గాజీయుల, అష్డోదీయుల, అష్కెలోనీయుల, గాతీయుల, ఎక్రోనీయుల దేశాలూ

4 దక్షిణ దిక్కున ఆవీయుల దేశమూ కనానీయుల దేశమంతా సీదోనీయుల మేరా నుండి ఆఫెకు వరకూ ఉన్న అమోరీయుల సరిహద్దు వరకూ

5 గిబ్లీయుల దేశమూ హెర్మోను కొండ దిగువన ఉన్న బయల్గాదు నుండి హమాతుకు పోయే మార్గం వరకూ లెబానోను ప్రదేశమంతా లెబానోను నుండి మిశ్రేపొత్మాయిము వరకూ దేశం ఇంకా మిగిలి ఉంది.

6 సీదోను ప్రజలతో సహా పర్వత ప్రాంతం ప్రజలందరినీ నేను ఇశ్రాయేలీయుల ముందు నుండి వెళ్లగొడతాను. కాబట్టి నేను ఆజ్ఞాపించిన విధంగా నీవు ఇశ్రాయేలీయులకు దాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టాలి.

7 తొమ్మిది గోత్రాలకు, మనష్షే అర్థ గోత్రానికి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టు.”

8 యెహోవా సేవకుడు మోషే వారికిచ్చిన విధంగా రూబేనీయులూ గాదీయులూ తూర్పుదిక్కున, అంటే యొర్దాను అవతల స్వాస్థ్యం పొందారు.

9 అదేమంటే, అర్నోను ఏటిలోయ దగ్గర ఉన్న అరోయేరు మొదలు ఆ లోయమధ్య ఉన్న పట్టణం నుండి దీబోను వరకూ మేదెబా మైదానమంతా, అమ్మోనీయుల సరిహద్దు వరకూ

10 హెష్బోనులో పాలిస్తున్న అమోరీయుల రాజైన సీహోనుకు చెందిన సమస్త పట్టణాలు,

11 గిలాదూ గెషూరీయుల, మాయకాతీయుల దేశమూ హెర్మోను మన్యమంతా సల్కావరకూ బాషాను దేశమంతా

12 రెఫాయీయుల్లో మిగిలి ఉన్నవారిలో అష్తారోతులో ఎద్రెయీలో పరిపాలిస్తున్న ఓగు రాజ్యమంతా మిగిలి ఉంది. మోషే ఆ రాజులను జయించి వారి దేశాన్ని పట్టుకున్నాడు.

13 కానీ ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశాన్ని గానీ మాయకాతీయుల దేశాన్ని గానీ పట్టుకోలేదు కాబట్టి గెషూరీయులు మాయకాతీయులు ఇప్పటి వరకూ ఇశ్రాయేలీయుల మధ్యలో నివసిస్తున్నారు.

14 లేవి గోత్రానికే అతడు స్వాస్థ్యం ఇవ్వలేదు. ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా మోషేతో చెప్పినట్టు “ప్రజలు ఆయనకు అర్పించే దహన బలులే” వారికి స్వాస్థ్యం.

15 వారి వంశాలను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్యమిచ్చాడు.

16 వారి సరిహద్దు ఏదంటే, అర్నోను నది లోయ పక్కన ఉన్న అరోయేరు మొదలు ఆ లోయలోని పట్టణం నుండి మేదెబా దగ్గర మైదానమంతా.

17 ఇది గాక రూబేను గోత్రికులు హెష్బోను, దాని మైదానంలోని పట్టణాలన్నీ, దీబోను, బామోత్బయలు, బేత్బయల్మెయోను,

18 యాహసు, కెదేమోతు, మేఫాతు,

19 కిర్యతాయిము, సిబ్మాలోయ లోని కొండ మీది శెరెత్షహరు ప్రాంతాలు దక్కించుకున్నారు.

20 అంతేకాక, బేత్పయోరు, పిస్గా కొండచరియలు, బెత్యేషిమోతు,

21 మైదానంలోని పట్టణాలు అన్నీ, ఇంకా ఎవీరేకెము, సూరు, హోరు, రేబ, అనే మిద్యాను రాజుల దేశాన్నీ అమోరీయుల రాజైన సీహోను రాజ్యమంతటినీ వారికి మోషే స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇవి హెష్బోనులో పరిపాలించే సీహోను అధికారం కింద ఉన్న ప్రాంతాలు. ఇతన్నిమోషే ఓడించాడు.

22 ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడు, సోదెగాడు అయిన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గంతో చంపారు.

23 యొర్దాను ప్రదేశమంతా రూబేనీయులకు సరిహద్దు. అదీ, దానిలోని పట్టణాలూ, గ్రామాలూ రూబేనీయుల వంశాల ప్రకారం వారికి కలిగిన స్వాస్థ్యం.

24 మోషే గాదు గోత్రానికి, అంటే గాదీయులకు వారి వంశాల ప్రకారం స్వాస్థ్యమిచ్చాడు.

25 వారి సరిహద్దు యాజెరు, గిలాదు పట్టణాలన్నీ, రబ్బాకు ఎదురుగా ఉన్న అరోయేరు వరకూ అమ్మోనీయుల దేశంలో సగభాగం.

26 హెష్బోను మొదలు రామత్మిజ్బెతు బెతోనిము వరకూ, మహనయీము మొదలు దెబీరు సరిహద్దు వరకూ.

27 లోయలో బేతారాము బేత్నిమ్రా, సుక్కోతు, సాపోను, అంటే హెష్బోను రాజైన సీహోను రాజ్యశేషం, తూర్పు దిక్కున యొర్దాను అవతల కిన్నెరెతు సముద్రతీరం వరకూ ఉన్న యొర్దాను ప్రదేశం.

28 ఇవీ, వారి వంశాల ప్రకారం గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణాలు, గ్రామాలు.

29 మోషే మనష్షే అర్థగోత్రానికి స్వాస్థ్యమిచ్చాడు. అది వారి వంశాల ప్రకారం మనష్షీయుల అర్థగోత్రానికి స్వాస్థ్యం.

30 వారి సరిహద్దు మహనయీము మొదలు బాషాను అంతా, బాషాను రాజైన ఓగు రాజ్యమంతా, బాషానులోని యాయీరు పురాలు అయిన అరవై పట్టణాలు,

31 గిలాదులో సగం, అష్తారోతు, ఎద్రెయి అనే బాషానులోని ఓగు రాజ్య పట్టణాలు. ఇవన్నీ మనష్షే కుమారుడు మాకీరు, అనగా మాకీరీయుల్లో సగం మందికి వారి వంశాల ప్రకారం కలిగాయి.

32 ఇవీ, యెరికో దగ్గర తూర్పు దిక్కున యొర్దాను అవతల ఉన్న మోయాబు మైదానంలో మోషే పంచి పెట్టిన స్వాస్థ్యాలు.

33 లేవీ గోత్రానికి మోషే స్వాస్థ్యం పంచిపెట్ట లేదు, ఎందుకంటే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో చెప్పినట్టుగా ఆయనే వారికి స్వాస్థ్యం.