Jeremiah 52 in Telugu

1 తన పరిపాలన ప్రారంభించినప్పుడు సిద్కియా వయస్సు 21 సంవత్సరాలు. అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు. ఆమె లిబ్నా అనే ఊరికి చెందిన యిర్మీయా కూతురు.

2 యెహోయాకీము లాగే సిద్కియా కూడా యెహోవా దృష్టికి దుర్మార్గంగా ప్రవర్తించాడు.

3 యెహోవా తీవ్రమైన కోపంతో వాళ్ళని తన ఎదుట నుండి వెళ్లగొట్టే వరకూ ఈ దుర్మార్గాలు యెరూషలేములోనూ యూదాలోనూ జరిగాయి. తర్వాత సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేశాడు.

4 అతని పరిపాలనలో తొమ్మిదో సంవత్సరం పదోనెల్లో పదో రోజున బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యాన్నంతా తీసుకుని యెరూషలేముకు వచ్చాడు. వాళ్ళు యెరూషలేముకు ఎదురుగా శిబిరం వేసుకున్నారు.

5 ఈ విధంగా రాజైన సిద్కియా పరిపాలనలో పదకొండో సంవత్సరం వరకూ పట్టణం ముట్టడిలో ఉంది.

6 ఆ సంవత్సరం నాలుగో నెల తొమ్మిదో రోజున పట్టణంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. దేశంలో ప్రజలకు ఆహరం బొత్తిగా లేకుండా పోయింది.

7 అప్పుడు ప్రాకారాలను పడగొట్టారు. కల్దీయులు పట్టణంలో ప్రవేశించారు. పట్టణంలో సైనికులందరూ రాజు తోట దగ్గరున్న రెండు గోడల మధ్య ద్వారం గుండా పట్టణం విడిచిపెట్టి పారిపోయారు. అరాబా దిశగా తరలి వెళ్ళారు.

8 కానీ కల్దీయుల సైన్యం రాజును తరిమింది. యెరికో సమీపంలోని యోర్దాను నదీలోయ మైదాన ప్రాంతంలో వాళ్ళు సిద్కియాను తరిమి పట్టుకున్నారు. అతని సైన్యం అతణ్ణి విడిచి పెట్టి కకావికలై పోయారు.

9 వాళ్ళు రాజును పట్టుకుని హమాతు దేశంలోని రిబ్లా పట్టణంలో ఉన్న బబులోను రాజు దగ్గరికి అతణ్ణి తీసుకు వచ్చారు. అక్కడే అతడు యూదా రాజైన సిద్కియాకు శిక్ష విధించాడు.

10 బబులోను రాజు సిద్కియా కొడుకులను అతని కళ్ళ ఎదుటే చంపించాడు. అతడు రిబ్లాలోనే యూదా అధిపతులనందరినీ ఊచకోత కోయించాడు.

11 సిద్కియా రెండు కళ్ళూ పీకించాడు. అతణ్ణి ఇత్తడి సంకెళ్ళతో బంధించి, బబులోనుకు తీసుకు వచ్చారు. అతడు చనిపోయేంత వరకూ బబులోను రాజు అతణ్ణి చెరసాలలోనే ఉంచాడు.

12 అయిదో నెల పదో రోజున, అంటే బబులోను రాజైన నెబుకద్నెజరు పరిపాలన పందొమ్మిదో సంవత్సరంలో బబులోను రాజు అంగరక్షకుల అధిపతీ, రాజు సేవకుడూ అయిన నెబూజరదాను యెరూషలేముకు వచ్చాడు.

13 అతడు యెహోవా మందిరాన్నీ, రాజు భవనాన్నీ, యెరూషలేములోని ప్రాముఖ్యమైన ఇళ్లనూ తగలబెట్టించాడు.

14 రాజు దగ్గర అంగరక్షకుల అధిపతితో పాటు వెళ్ళిన సైన్యం యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలను కూల్చివేశారు.

15 రాజు అంగరక్షకుల అధిపతి నెబూజరదాను ప్రజల్లో కొందరు నిరుపేదలనూ పట్టణంలో మిగిలిపోయిన కొందరినీ, బబులోను రాజు పక్షాన చేరిన వాళ్ళనూ, వృత్తి పనుల వాళ్ళలో కొందరినీ తీసుకు పోయాడు.

16 రాజు అంగరక్షకుల అధిపతి నెబూజరదాను ద్రాక్షాతోటల్లో పని చేయడానికి కొందరు నిరుపేదలను ఉండనిచ్చాడు.

17 కల్దీయులు యెహోవా మందిరంలో ఉన్న ఇత్తడి స్తంభాలను, పీటలను, ఇత్తడి సరస్సునూ ఊడదీసి వాటిని ముక్కలు చేసి ఆ ఇత్తడినంతా బబులోనుకు పట్టుకుపోయారు.

18 అలాగే బిందెలనూ, కుండలనూ గిన్నెలనూ కత్తెరలనూ గరిటెలనూ ఇంకా యాజకులు ఉపయోగించే ఇత్తడి వస్తువులు అన్నిటినీ తీసుకువెళ్ళారు.

19 పళ్ళేలనూ, ధూపం వేసే పళ్ళేలనూ పాత్రలనూ కుండలనూ దీప స్తంభాలనూ ఇంకా బంగారు పళ్ళేలనూ వెండి పళ్ళేలనూ రాజు అంగరక్షకుల అధిపతి తీసుకువెళ్ళాడు.

20 రాజైన సొలొమోను యెహోవా మందిరానికి చేయించిన రెండు స్థంభాలూ సరస్సూ పీటల కింద ఉన్న పన్నెండు ఎద్దుల ఇత్తడి ప్రతిమలూ అన్నీ ఇత్తడివి. ఆ ఇత్తడిని తూకం వేయడం సాధ్యం కాదు. వాటన్నిటినీ అతడు బబులోనుకు తీసుకు వెళ్ళాడు.

21 వాటిలో ఒక్కో స్తంభం దాదాపు ఇరవై ఆరు అడుగుల ఎత్తు ఉంటుంది. వాటి చుట్టు కొలత పదిహేడున్నర అడుగులు ఉంటుంది. ఇత్తడి రేకు నాలుగు వేళ్ళ మందం ఉంటుంది. అది లోపల బోలుగా ఉంటుంది.

22 ఒక స్తంభం పైన ఒక ఇత్తడి పీట ఉంది. ఆ పీట ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ పీట చుట్టూ ఇత్తడి దానిమ్మలూ, అల్లిక పనీ ఉన్నాయి. ఇవి కూడా ఇత్తడితో చేసినవే. రెండో స్తంభం పైన కూడా ఇలాగే ఉంది. దానిక్కూడా ఇత్తడి దానిమ్మలు ఉన్నాయి.

23 కాబట్టి పీటల పక్కన మొత్తం తొంభై ఆరు దానిమ్మలూ, అల్లిక పని చుట్టూ వంద దానిమ్మలూ ఉన్నాయి.

24 రాజు అంగరక్షకుల అధిపతి ప్రధానయాజకుడు శెరాయానూ, రెండవ యాజకుడు జెఫన్యానూ, ముగ్గురు కాపలా వాళ్ళనూ పట్టుకున్నాడు.

25 అతడు సైనికుల పైన ఉండే ఒక అధికారినీ, రాజు సలహాదారుల్లో ఏడుగురినీ పట్టుకున్నాడు. వీళ్ళు ఇంకా పట్టణంలోనే ఉన్నారు. వీళ్ళతో పాటు పట్టణంలో ప్రముఖులైన అరవై మందినీ పట్టుకున్నాడు.

26 రాజు అంగరక్షకుల అధిపతి నెబూజరదాను వీళ్ళందరినీ రిబ్లాలో ఉన్న బబులోను రాజు దగ్గరికి తీసుకు వచ్చాడు.

27 బబులోను రాజు హమాతు దేశంలోని రిబ్లాలో వాళ్ళని కొట్టి చంపించాడు. మిగిలిన యూదా వాళ్ళను బందీలుగా బబులోనుకు తీసుకు వెళ్ళాడు.

28 నెబుకద్నెజరు తన పరిపాలన ఏడో సంవత్సరంలో 3,023 మంది యూదులను బందీలుగా తీసుకు వెళ్ళాడు.

29 నెబుకద్నెజరు పరిపాలన పద్దెనిమిదో సంవత్సరంలో యెరూషలేము నుండి 832 మందిని బందీలుగా తీసుకు వెళ్ళాడు.

30 నెబుకద్నెజరు పరిపాలన ఇరవై మూడో సంవత్సరంలో రాజు అంగరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను యూదుల్లో 745 మందిని బందీలుగా తీసుకు వెళ్ళాడు. కాబట్టి మొత్తం యూదా దేశం నుండి బందీలుగా వెళ్ళిన వాళ్ళ సంఖ్య 4,600.

31 యూదా రాజైన యెహోయాకీను బందీగా వెళ్ళిన ముప్ఫై ఏడో సంవత్సరం పన్నెండో నెల ఇరవై ఐదో రోజున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తన పరిపాలన మొదటి సంవత్సరంలో అతణ్ణి చెరసాల నుండి విడుదల చేశాడు.

32 రాజు అతనితో దయగా మాట్లాడాడు. బబులోనులో తనతో ఉన్న మిగిలిన రాజుల కంటే గౌరవనీయమైన స్థానాన్ని అతనికిచ్చాడు.

33 రాజైన ఎవీల్మెరోదకు అతడు వేసుకున్న చెరసాల బట్టలు తీసి వేయించాడు. ఇక యెహోయాకీను బతికి ఉన్న రోజులన్నీ అతడు రాజైన ఎవీల్మెరోదకుతో కలసి భోజనం చేస్తూ ఉన్నాడు.

34 అతడు చనిపోయే వరకూ అతని పోషణ కోసం రాజు భత్యం ఇస్తూ వచ్చాడు.