Jeremiah 27 in Telugu

1 యూదా రాజు యోషీయా కొడుకు యెహోయాకీము పరిపాలించడం మొదలు పెట్టినపుడు యెహోవా దగ్గరనుంచి ఈ సందేశం యిర్మీయాకు వచ్చింది.

2 యెహోవా నాకు ఇలా చెప్పాడు “నువ్వు కాడి, బేడీలూ చేయించుకుని నీ మెడకు కట్టుకో.

3 ఎదోం, మోయాబు, అమ్మోను, తూరు, సీదోను దేశాల రాజుల దగ్గర నుంచి యూదా రాజు సిద్కియా దగ్గరికి యెరూషలేముకు రాయబారులు వచ్చారు.

4 ఆ రాయబారులు తమ యజమానులకు తెలియచేయాలని ఈ ఆజ్ఞ వారితో చెప్పు, సేనల ప్రభువు ఇశ్రాయేలు దేవుడు చెప్పేదేమిటంటే, మీరు మీ యజమానులకు ఈ విషయం తెలియజేయండి.

5 ‘నా గొప్ప బలంతో చాచిన చేతితో భూమిని చేశాను. భూమి మీద ఉన్న మట్టినీ జంతువులనూ నేనే చేశాను. వాటిని నా దృష్టిలో ఎవరు సరిగా ఉన్నారో వారికే ఇస్తాను.

6 ఇప్పుడు దేశాలన్నిటినీ నా సేవకుడూ బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకు ఇస్తున్నాను. భూమి మీద తిరిగే జంతువులను కూడా అతణ్ణి సేవించడానికి ఇస్తున్నాను.

7 అతని స్వదేశానికి అంతం వచ్చే వరకూ రాజ్యాలన్నీ అతనికీ అతని కొడుకుకీ అతని మనుమడికీ సేవ చేస్తారు. ఆ తర్వాత అనేక రాజ్యాలూ గొప్ప రాజులూ అతనికి వ్యతిరేకంగా పనిచేస్తారు.

8 ఏ దేశం, ఏ రాజ్యం బబులోను రాజు నెబుకద్నెజరు సేవ చేయదో, బబులోను రాజు కాడిని తన మెడ మీద పెట్టుకోదో ఆ దేశాన్ని నేను శిక్షిస్తాను. అతని చేత బొత్తిగా నాశనం చేయించే వరకూ ఆ దేశాన్ని కత్తితో కరువుతో అంటు రోగాలతో శిక్షిస్తాను.’ ఇది యెహోవా వాక్కు.

9 కాబట్టి ‘మీరు బబులోను రాజుకు సేవ చేయవద్దు’ అని మీ ప్రవక్తలూ సోదెగాళ్ళూ, కలల అర్థం చెప్పేవాళ్ళూ, శకునాలు చూసేవాళ్ళూ, మాంత్రికులూ చెబుతుంటే వినొద్దు.

10 మిమ్మల్ని మీ దేశం నుంచి దూరంగా పంపించడానికి వాళ్ళు అబద్ధ ప్రవచనాలు మీకు ప్రకటిస్తున్నారు. నేను మిమ్మల్ని వెళ్లగొడతాను. మీరు నాశనమవుతారు.

11 అయితే ఏ ప్రజలు బబులోను రాజు కాడి కిందికి తమ మెడను వంచి అతనికి సేవ చేస్తారో ఆ ప్రజలను తమ దేశంలో నెమ్మదితో ఉండనిస్తాను. వాళ్ళు తమ భూమిని సాగుచేసుకుంటూ దానిలోనే కాపురముంటారు.” ఇది యెహోవా వాక్కు.

12 నేను యూదా రాజు సిద్కియాతో మాట్లాడి ఈ విషయం చెప్పాను. “బబులోను రాజు కాడిని మీ మెడ మీద పెట్టుకుని, అతనికీ అతని ప్రజలకూ సేవ చేస్తే మీరు బతుకుతారు.

13 బబులోను రాజుకు సేవ చేయని ప్రజలు కత్తితో గానీ కరువుతో గానీ అంటురోగాలతోగానీ చస్తారు అని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు, నీ ప్రజలు అలా ఎందుకు చావాలి?

14 కాబట్టి ‘మీరు బబులోను రాజుకు సేవ చేయవద్దు’ అని మీతో చెప్పే ప్రవక్తలు అబద్దమే ప్రవచిస్తున్నారు. నేను వాళ్ళను పంపలేదు, వాళ్ళ మాటలు వినవద్దు.” ఇది యెహోవా వాక్కు.

15 “మిమ్మల్ని మీ దేశం నుంచి దూరంగా పంపించడానికి వాళ్ళు అబద్ధ ప్రవచనాలు మీకు ప్రకటిస్తున్నారు. నేను మిమ్మల్ని వెళ్లగొడతాను. మీరూ మీకు ప్రవచించే మీ ప్రవక్తలు నాశనమవుతారు.”

16 యాజకులతో ప్రజలందరితో నేను ఈ మాటలు చెప్పాను. “యెహోవా చెప్పేదేమిటంటే, ‘యెహోవా మందిరపు పాత్రలను ఇప్పుడే త్వరగా బబులోను నుంచి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది.’ అని ప్రవచించే మీ ప్రవక్తలు మీతో అబద్ధాలు చెబుతున్నారు.

17 వాళ్ళ మాటలు వినవద్దు. బబులోను రాజుకు సేవ చేస్తే మీరు బతుకుతారు. ఈ పట్టణం ఎందుకు పాడైపోవాలి?

18 వాళ్ళు ప్రవక్తలైతే యెహోవా సందేశం వాళ్ళతో ఉంటే యెహోవా మందిరంలో యూదా రాజు మందిరంలో యెరూషలేములో మిగిలిన పాత్రలు బబులోనుకు తరలి పోకుండా వాళ్ళు సేనల ప్రభువు యెహోవాను బతిమాలుకోవడం మంచిది.”

19 బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేములోనుంచి యెహోయాకీము కొడుకు యెకొన్యాను యూదా యెరూషలేముల ప్రధానులందరినీ బబులోనుకు బందీలుగా తీసుకుపోయినప్పుడు,

20 అతడు విడిచి పెట్టిన స్థంభాలు, సముద్రం, పీఠాలు, ఈ పట్టణంలో మిగిలిన పాత్రలను గురించి సేనల ప్రభువు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు.

21 యెహోవా మందిరంలో యూదా రాజు రాజ భవనంలో యెరూషలేములోని మిగిలిన పాత్రలను గురించి ఇశ్రాయేలు దేవుడు సేనల అధిపతి అయిన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు,

22 “వాటిని బబులోనుకు తెస్తారు. నేను వాటి కోసం అక్కడికి వెళ్ళే రోజు వరకు అవి అక్కడే ఉంటాయి. అప్పుడు నేను వాటిని మళ్ళీ తెప్పించి ఈ స్థలంలో ఉంచుతాను. ఇది యెహోవా వాక్కు.”