Isaiah 11 in Telugu

1 యెష్షయి వేరు నుంచి చిగురు పుడుతుంది. అతని వేరుల నుంచి కొమ్మ ఎదిగి ఫలిస్తుంది.

2 జ్ఞానవివేకాలకు ఆధారమైన యెహోవా ఆత్మ, ఆలోచన బలాలకు ఆధారమైన యెహోవా ఆత్మ, తెలివినీ యెహోవా పట్ల భయభక్తులనూ పుట్టించే యెహోవా ఆత్మ అతని మీద నిలుస్తుంది.

3 యెహోవా భయం అతనికి ఆనందం కలిగిస్తుంది.

4 కంటి చూపును బట్టి అతను తీర్పు తీర్చడు. తాను విన్న దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీరుస్తాడు. భూనివాసుల్లో దీనులైన వాళ్లకు నిజాయితీగా విమర్శ చేస్తాడు. తన నోటి దండంతో లోకాన్ని కొడతాడు. తన పెదవుల ఊపిరితో దుర్మార్గులను హతం చేస్తాడు.

5 అతని నడుముకు న్యాయం, అతని మొలకు సత్యం నడికట్టుగా ఉంటాయి.

6 తోడేలు గొర్రెపిల్లతో నివాసం చేస్తుంది. చిరుతపులి మేకపిల్లతో కలిసి పడుకుంటుంది. దూడ, సింహం కూన, కొవ్విన దూడ కలిసి ఉంటాయి. చిన్న పిల్లవాడు వాటిని తోలుకెళ్తాడు.

7 ఆవు, ఎలుగుబంటి కలిసి మేస్తాయి. వాటి పిల్లలు ఒక్క చోటే పండుకుంటాయి. ఎద్దు మేసినట్టు సింహం గడ్డి మేస్తుంది.

8 పాలు తాగే పసిపిల్ల పాము పుట్ట మీద ఆడుకుంటుంది. పాలు విడిచిన పిల్ల, సర్పం పుట్టలో తన చెయ్యి పెడుతుంది.

9 నా పరిశుద్ధ పర్వతమంతటి మీద, ఏ మృగమూ హాని చెయ్యదు, నాశనం చెయ్యదు. ఎందుకంటే సముద్రం నీటితో నిండి ఉన్నట్టు లోకం యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది.

10 ఆ రోజున ప్రజలకు ధ్వజంగా యెష్షయి వేరు నిలుస్తుంది. జాతులు ఆయన కోసం వెదకుతాయి. ఆయన విశ్రమించే స్థలం ప్రభావం కలది అవుతుంది.

11 ఆ రోజున మిగిలిన తన ప్రజలను అష్షూరులో నుంచీ. ఐగుప్తులో నుంచీ, పత్రోసులో నుంచీ, కూషులో నుంచీ, ఏలాములో నుంచీ, షీనారులో నుంచీ, హమాతులో నుంచీ, సముద్రద్వీపాల్లో నుంచీ విడిపించి రప్పించడానికి యెహోవా రెండోసారి తన చెయ్యి చాపుతాడు.

12 జాతులను పోగు చెయ్యడానికి ఆయన ఒక ధ్వజం నిలబెట్టి, బహిష్కరణకు గురైన ఇశ్రాయేలీయులను పోగుచేస్తాడు. చెదిరి పోయిన యూదా వాళ్ళను భూమి నలుదిక్కుల నుంచి సమకూరుస్తాడు.

13 ఎఫ్రాయిముకున్న అసూయను నిలువరిస్తాడు. యూదా పట్ల విరోధంగా ఉన్న వాళ్ళు నిర్మూలమౌతారు. ఎఫ్రాయిము యూదాను బట్టి అసూయ పడడు. యూదా ఎఫ్రాయిమును బాధించడు

14 వాళ్ళు పడమటివైపు ఉన్న ఫిలిష్తీయుల కొండల మీదకి దూసుకొస్తారు. వాళ్ళు ఏకమై తూర్పు వారిని కొల్లగొడతారు. వాళ్ళు ఎదోము మీద, మోయాబు మీద దాడి చేస్తారు, అమ్మోనీయులు వాళ్లకు విధేయులౌతారు.

15 యెహోవా ఐగుప్తు సముద్రం అగాధాన్ని విభజిస్తాడు. చెప్పులు తడవకుండా మనుషులు దాన్ని దాటి వెళ్ళేలా తన వేడి ఊపిరిని ఊది, యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించి, ఏడు కాలువలుగా దాన్ని చీలుస్తాడు.

16 ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు వచ్చిన రోజున వాళ్లకు దారి ఉన్నట్టు, అష్షూరులో మిగిలిన ఆయన ప్రజలు అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు వాళ్లకు రాజమార్గం ఉంటుంది.