Ezekiel 32 in Telugu

1 పన్నెండవ నెల మొదటి రోజు యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.

2 నరపుత్రుడా, ఐగుప్తురాజు ఫరో గురించి ఏడుపు పాట ఎత్తి అతనికి ఈ మాట చెప్పు. “రాజ్యాల్లో నువ్వు కొదమ సింహం వంటి వాడివి. నదిలో మొసలివంటి వాడివి. నీ కాళ్లతో నీళ్లు కలియబెడుతూ వాటిని బురదగా చేశావు.”

3 యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, “నేను, నా వల నీ మీద వేస్తే వాళ్ళు నిన్ను నా వలలో నుంచి అనేక ప్రజల మధ్య బయటికి లాగుతారు.

4 నేను నిన్ను నేల మీద పడేస్తాను. బయటి పొలంలో పారేస్తాను. గాలిలో ఎగిరే అన్ని రకాల పిట్టలు నీ మీద వాలేలా చేస్తాను. భూమి మీద ఉన్న అన్ని రకాల జంతువులు నీ మాంసాన్ని కడుపారా తింటాయి.

5 నీ మాంసాన్ని పర్వతాల మీద వేస్తాను. పురుగులు పట్టిన నీ కళేబరంతో లోయలను నింపుతాను.

6 నీ రక్తాన్ని పర్వతాల మీద పోస్తాను. వాగులు రక్తంతో నిండుతాయి.

7 నేను నీ దీపాన్ని ఆర్పివేసినప్పుడు ఆకాశాన్ని మూసేసి, నక్షత్రాలను చీకటి చేస్తాను. సూర్యుణ్ణి మబ్బుతో కమ్ముతాను. చంద్రుడు వెన్నెల ఇవ్వడు.

8 నిన్నుబట్టి ఆకాశంలో ప్రకాశించే జ్యోతులన్నిటినీ చీకటి చేస్తాను. నీ దేశం మీద చీకటి కమ్ముతుంది.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.

9 “నువ్వు ఎరగని దేశాల్లోకి నేను నిన్ను వెళ్లగొట్టి, నిన్ను నాశనం చేసేటప్పుడు అనేక మందికి కోపం పుట్టిస్తాను.

10 నా కత్తి రాజుల ఎదుట ఆడించేటప్పుడు నీ కారణంగా చాలామంది దిగ్భ్రాంతి చెందుతారు. నువ్వు పడిపోయే రోజున వాళ్ళంతా ఎడతెరిపి లేకుండా ప్రాణభయంతో వణకుతారు.”

11 యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “బబులోను రాజు కత్తి నీ మీదికి వస్తుంది!

12 శూరుల కత్తితో నేను నీ సేనను కూలుస్తాను. వాళ్ళలో ప్రతి శూరుడూ రాజ్యాలను వణికిస్తాడు. వాళ్ళు ఐగుప్తీయుల గర్వం అణచివేస్తారు. దాని సైన్యాన్నంతా నాశనం చేస్తారు.

13 సమృద్ధిగా ఉన్న నీళ్ల దగ్గరున్న పశువులన్నిటినీ నేను నాశనం చేస్తాను. ప్రజల కాళ్ళు గానీ పశువుల కాళ్ళు గానీ ఆ నీటిని కదిలించలేవు.

14 అప్పుడు నేను వాటి నీళ్లు ఆపి, నూనె పారేలా వాళ్ళ నదులు పారేలా చేస్తాను.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.

15 “నేను ఐగుప్తు దేశాన్ని పాడు చేసి అందులో ఉన్నదంతా నాశనం చేసి దాని నివాసులందరినీ నిర్మూలం చేస్తుంటే నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.

16 ఇది శోకగీతం. రాజ్యాల కూతుర్లు ఈ పాట ఎత్తి పాడతారు. వాళ్ళు ఐగుప్తు మీదా, దాని సమూహమంతటి మీదా ఆ పాట పాడతారు. ఇదే యెహోవా ప్రభువు సందేశం.

17 పన్నెండవ సంవత్సరం అదే నెల పదిహేనవ రోజు యెహోవా నాకు ఈ విషయం తెలియచేశాడు.

18 నరపుత్రుడా, ఐగుప్తీయుల సమూహం గురించి విలపించు. భూమి కిందికి పాతాళానికి దిగిపోయిన వాళ్ళ దగ్గరికి, ఆమెనూ గొప్ప రాజ్యాల కూతుళ్ళనూ తోసి వెయ్యి.

19 వాళ్ళతో ఇలా అను, ‘మిగతావాళ్ళకంటే నువ్వు నిజంగా అందగత్తెవా? సున్నతిలేని వాళ్ళ దగ్గరికి దిగి వెళ్లి పడుకో’

20 కత్తితో చచ్చిన వాళ్ళతోబాటు వాళ్ళు కూలుతారు. అది కత్తిపాలవుతుంది. ఆమె విరోధులు ఆమెనూ ఆమె సేవకులనూ ఈడ్చుకుపోతారు.

21 పాతాళంలోని గొప్ప యోధులు ఐగుప్తు గురించీ దాని మిత్రుల గురించీ ఇలా చెబుతారు, ‘వీళ్లిక్కడికి దిగి వచ్చేశారు! కత్తితో చచ్చిన సున్నతిలేని వాళ్ళ దగ్గర వీరు పడుకుంటారు’

22 అష్షూరు, దాని గుంపంతా అక్కడే ఉంది! దాని చుట్టూ వాళ్ళ సమాధులున్నాయి. వాళ్ళంతా కత్తితో చచ్చారు.

23 దాని సమాధులు పాతాళాగాధంలో ఉన్నాయి. దాని గుంపులు దాని సమాధి చుట్టూ ఉన్నాయి. వాళ్ళంతా సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చిన వాళ్ళు. వాళ్ళంతా కత్తితో చచ్చిన వాళ్ళు.

24 ఏలాము, దాని గుంపంతా అక్కడే ఉంది! దాని చుట్టూ వాళ్ళ సమాధులున్నాయి. వాళ్ళంతా కత్తితో చచ్చారు. వాళ్ళంతా సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చిన వాళ్ళు. వాళ్ళు సున్నతి లేకుండా పాతాళంలోకి దిగిపోయారు. వాళ్ళు సిగ్గు పాలవుతారు.

25 చచ్చిన వాళ్ళ మధ్య దానికీ దాని సమూహానికీ ఒక పరుపు సిద్ధం చేశారు. దాని చుట్టూ వాళ్ళ సమాధులున్నాయి. వాళ్ళంతా సున్నతి లేకుండా చచ్చారు. వాళ్ళు సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చినవాళ్ళు. పాతాళం లోకి దిగిపోయిన వాళ్ళతో పాటు వాళ్ళు కూడా సిగ్గు పాలవుతారు. చచ్చిన వాళ్ళ మధ్య ఏలాము ఉంది.

26 అక్కడ మెషెకు తుబాలు దాని గుంపంతా ఉన్నాయి. దాని సమాధులు దాని చుట్టూ ఉన్నాయి. వాళ్ళంతా సున్నతి లేని వాళ్ళు. వాళ్ళు సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు కత్తిపాలయ్యారు.

27 వీళ్ళు సున్నతి లేని వాళ్ళలో పడిపోయిన శూరుల దగ్గర పడుకోరు. వాళ్ళు తమ యుద్ధాయుధాలన్నిటితో పాతాళంలోకి దిగిపోయి, తమ కత్తులను తమ తలల కింద ఉంచుకుని పడుకుంటారు. తమ డాళ్ళను తమతో ఉంచుకుంటారు. వాళ్ళు సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చినవాళ్ళు.

28 కాబట్టి, ఐగుప్తు, నువ్వు సున్నతి లేని వాళ్ళ మధ్య నాశనమై, కత్తి పాలైన వాళ్ళ దగ్గర పడుకుంటావు.

29 అక్కడ ఎదోము, దాని రాజులు దాని అధిపతులంతా ఉన్నారు. వాళ్ళు పరాక్రమవంతులైనా కత్తి పాలైన వాళ్ళ దగ్గర ఉన్నారు. సున్నతి లేని వాళ్ళ దగ్గర పాతాళంలోకి దిగిపోయిన వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా పడుకున్నారు.

30 అక్కడ ఉత్తర దేశపు అధిపతులంతా, చచ్చిన వాళ్ళతో దిగిపోయిన సీదోనీయులంతా ఉన్నారు. వాళ్ళు పరాక్రమవంతులై భయం పుట్టించినా సిగ్గు పాలయ్యారు. సున్నతి లేకుండా కత్తి పాలైన వాళ్ళ మధ్య పడుకున్నారు. గోతిలోకి దిగిపోయిన వాళ్ళతో పాటు సిగ్గుపాలయ్యారు.

31 కత్తి పాలైన ఫరో, అతని వాళ్ళంతా వాళ్ళను చూచి తమ సమూహమంతటిని గురించి ఓదార్పు తెచ్చుకుంటారు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.

32 “సజీవుల లోకంలో వాళ్ళతో నేను ఉగ్రత తెప్పించాను. అయితే సున్నతి లేనివాళ్ళతో కత్తి పాలైనవాళ్ళతో పడుకుంటారు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.