Ezekiel 28 in Telugu

1 అప్పుడు యెహోవా నాకు ఈ విషయం తెలియచేశాడు.

2 నరపుత్రుడా, తూరు రాజ్యం పాలించే వాడితో ఇలా చెప్పు. “యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, నువ్వు అహంకారంతో, ‘నేను దేవుణ్ణి. సముద్రాల మధ్యలో దేవుడు కూర్చునే చోట నేను కూర్చుంటాను’ అంటున్నావు. నువ్వు మనిషివే. దేవుడివి కావు. నీకు దేవుని మనస్సు ఉందని నువ్వనుకుంటున్నావు.

3 నువ్వు దానియేలు కంటే తెలివి గలవాడివనీ తెలియనిదంటూ నీకేదీ లేదనీ అనుకుంటున్నావు!

4 నీ తెలివి తేటలతో నేర్పుతో ధనవంతుడివై, నీ ఖజానాల్లో వెండి బంగారాలను పోగుచేసుకున్నావు.

5 నీ గొప్ప తెలివితేటలతో నీ వ్యాపారంతో నీ సంపదను వృద్ధి చేసుకున్నావు. నీ సంపద బట్టి నీ హృదయం గర్వించింది.

6 కాబట్టి యెహోవా ప్రభువు ఇలా అంటున్నాడు, నీకు దేవుని మనస్సు ఉందని నువ్వనుకుంటున్నావు.

7 నేను విదేశీయులను, ఇతర రాజ్యాలనుంచి క్రూరులను, నీ మీదికి రప్పిస్తాను. తెలివితో నువ్వు నిర్మించుకున్న నీ అందమైన పట్టణాల మీద వాళ్ళు తమ కత్తులు ఝళిపించి నీ వైభవాన్ని ధ్వంసం చేస్తారు.

8 వాళ్ళు నిన్ను నీ సమాధిలో పడేస్తారు. సముద్రాల్లో మునిగి చచ్చేవాళ్ళలాగా నువ్వు చస్తావు.

9 నిన్ను చంపేవాళ్ళ ఎదుట, ‘నేను దేవుణ్ణి’ అంటావా? నువ్వు మనిషివే గానీ దేవుడివి కాదు గదా! నిన్ను పొడిచేవాళ్ళ చేతుల్లో నువ్వు ఉంటావు.

10 నువ్వు విదేశీయుల చేతుల్లో సున్నతిలేని వాళ్ళ చావు చస్తావు. ఈ విషయం చెప్పింది నేనే. ఇదే యెహోవా ప్రభువు సందేశం.”

11 యెహోవా నాకీ విషయం మళ్ళీ తెలియచేశాడు.

12 “నరపుత్రుడా, తూరు రాజును గురించి శోకగీతం ఎత్తి ఇలా చెప్పు, యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఒకప్పుడు నువ్వు పరిపూర్ణంగా గొప్ప తెలివితేటలతో అందాల రాశిలా ఉండే వాడివి.

13 దేవుని తోట, ఏదెనులో నువ్వున్నావు! అన్ని రకాల ప్రశస్త రత్నాలు నీకు అలంకాంరంగా ఉండేవి. మాణిక్యం, గోమేధికం, సూర్యకాంతమణి, కెంపు, సులిమాని రాయి, మరకతం, నీలం, పద్మరాగం, మాణిక్యం, బంగారంలో పొదిగిన ఆభరణాలు నువ్వు అలంకరించుకున్నావు. నిన్ను సృజించిన రోజే అవి నీకు తయారయ్యాయి.

14 అభిషేకం పొందిన కెరూబులా నేను నిన్ను నియమించాను. దేవుని పర్వతం మీద నువ్వున్నావు. నిప్పుకణికల వంటి రాళ్ల మధ్య నువ్వు నడిచేవాడివి.

15 నిన్ను సృష్టించిన రోజునుంచి నీలో పాపం కనిపించే వరకూ నీ ప్రవర్తన లోపం లేకుండా ఉంది.

16 అయితే నీ వ్యాపారం ఎక్కువ కావడం వలన నువ్వు దౌర్జన్యంతో నిండిపోయి, పాపం చేశావు. కాబట్టి కావలిగా ఉన్న కెరూబూ, దేవుని పర్వతం మీద నిప్పుకణికల్లాంటి రాళ్లమధ్య నువ్వుండకుండా నేను నిన్ను తోలివేసి, నిర్మూలం చేశాను.

17 నీ సౌందర్యాన్ని చూసుకుని గర్వించావు. నీ వైభవాన్ని చూసుకుని నీ తెలివి పాడుచేసుకున్నావు. అందుకే నేను నిన్ను భూమి మీద పడేశాను. రాజులు నిన్ను చూసేలా వాళ్ళ ఎదుట నిన్నుంచాను.

18 నీ విస్తార పాపాలను బట్టి, నీ అన్యాయ వ్యాపారాన్ని బట్టి, నీ పవిత్ర స్థలాలను నువ్వు అపవిత్రం చేశావు. కాబట్టి నీలోనుంచి అగ్ని వచ్చేలా చేశాను. అది నిన్ను కాల్చివేస్తుంది. నిన్ను చూస్తున్నవాళ్ళందరి ఎదుట నిన్ను బూడిదగా చేస్తాను.

19 ప్రజల్లో నిన్ను ఎరిగిన వారంతా నిన్ను బట్టి వణికిపోతారు. నిర్ఘాంతపోతారు. నువ్విక ఉండవు.”

20 యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.

21 “నరపుత్రుడా, నీ ముఖాన్ని సీదోను పట్టణం వైపు తిప్పి దాన్ని గురించి ప్రవచించు.

22 యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, సీదోనూ, నేను నీకు విరోధిని. నీ మధ్య నాకు ఘనత వస్తుంది. నేను నీ మధ్య తీర్పు తీరుస్తూ ఉన్నపుడు నేను యెహోవానని నీ ప్రజలు తెలుసుకుంటారు. నన్ను నేను పవిత్రునిగా మీ మధ్య కనుపరచుకుంటాను.

23 నేను ఘోరమైన అంటురోగాన్ని మీ మధ్య పంపిస్తాను. మీ వీధుల్లో రక్తపాతం జరుగుతుంది. అన్ని వైపుల నుంచి నీ మీద కత్తి దూస్తారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.

24 ఇశ్రాయేలీయుల చుట్టూ గుచ్చుకునే ముళ్ళ కంపల్లాగా నొప్పి కలిగించే గచ్చతీగల్లాగా వారిని తృణీకరించిన ప్రజలు ఇంక ఎవరూ ఉండరు. అప్పుడు నేనే యెహోవా ప్రభువునని వాళ్ళు తెలుసుకుంటారు.”

25 యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే “ప్రజల్లో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను నేను దగ్గర చేర్చి, ప్రజల ఎదుట నన్ను నేను పరిశుద్ధ పరచుకుంటాను. అప్పుడు నా సేవకుడు యాకోబుకు నేనిచ్చిన తమ దేశంలో వాళ్ళు నివసిస్తారు.

26 వాళ్ళు అందులో భయం లేకుండా నివసించి ఇళ్ళు కట్టుకుని ద్రాక్షతోటలు నాటుకుంటారు. వారి చుట్టూ ఉండి వాళ్ళను తృణీకరించే వారందరికీ నేను శిక్ష విధించిన తరువాత వాళ్ళు భయం లేకుండా నివసించేటప్పుడు నేను తమ యెహోవా దేవుడినని వాళ్ళు తెలుసుకుంటారు.”