Exodus 11 in Telugu

1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “ఫరో మీదికీ ఐగుప్తు మీదికీ మరొక తెగులు రప్పించబోతున్నాను. దాని తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని వెళ్ళనిస్తాడు. ఎవ్వరూ మిగలకుండా శాశ్వతంగా అతడు మిమ్మల్ని దేశం నుండి పంపించి వేస్తాడు.

2 కాబట్టి ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ ఐగుప్తు జాతి వాళ్ళైన తమ పొరుగువాళ్ళ దగ్గర నుండి వెండి, బంగారు నగలు అడిగి తీసుకోవాలని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాలి.”

3 యెహోవా ఇశ్రాయేలు ప్రజల పట్ల ఐగుప్తీయులకు కనికరం కలిగేలా చేశాడు. అంతేకాక ఐగుప్తు దేశవాసులు, ఫరో సేవకులు మోషేను చాలా గొప్పగా ఎంచారు.

4 మోషే ఫరోతో ఇలా అన్నాడు “యెహోవా చెప్పింది ఏమిటంటే, అర్థరాత్రి నేను బయలుదేరి ఐగుప్తు దేశంలోకి వెళ్తాను.

5 ఐగుప్తు దేశంలో మొదట పుట్టిన సంతానమంతా చనిపోతారు. సింహాసనంపై ఉన్న ఫరో మొదటి సంతానం మొదలుకుని తిరగలి విసిరే పనిమనిషి మొదట పుట్టిన సంతానం దాకా, పశువుల్లో కూడా మొదట పుట్టినవన్నీ చనిపోతాయి.

6 అప్పుడు ఐగుప్తు దేశంలో ప్రతి చోటా గొప్ప విలాపం ఉంటుంది. అలాంటి ఏడుపు ఇంతవరకూ ఎన్నడూ పుట్టలేదు, ఇకపై ఎన్నడూ పుట్టదు.

7 యెహోవా ఐగుప్తీయుల నుండి ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకపరుస్తాడని మీరు తెలుసుకొనేలా ఇశ్రాయేలు ప్రజలపై గానీ జంతువులపై గానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరి మీదా కుక్క అయినా నాలుక ఆడించదు.

8 అప్పుడు నీ సేవకులైన వీరంతా నా దగ్గరికి వస్తారు. నా ఎదుట సాష్టాంగపడి, ‘నువ్వు, నిన్ను అనుసరించే వాళ్ళంతా ఈ దేశం విడిచి బయలుదేరండి’ అని చెబుతారు. అప్పుడు నేను నా ప్రజలతో వెళ్ళిపోతాను” అని చెప్పి మోషే ఫరో దగ్గర మండిపడుతూ వెళ్ళిపోయాడు.

9 అప్పుడు యెహోవా “ఐగుప్తు దేశంలో నేను చేసే అద్బుత క్రియలు అధికం అయ్యేలా ఫరో మీ మాట వినడు” అని మోషేతో చెప్పాడు.

10 మోషే అహరోనులు ఫరో సమక్షంలో ఈ అద్బుతాలు చేశారు. అయినప్పటికీ యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలను తన దేశం నుండి వెళ్ళనియ్యలేదు.