2 Samuel 24 in Telugu

1 యెహోవా కోపం మళ్ళీ ఇశ్రాయేలీయుల మీద రగులుకుంది. ఆయన వారికి వ్యతిరేకంగా దావీదును ప్రేరేపించాడు. “వెళ్లి ఇశ్రాయేలువారి, యూదావారి, జనాభా లెక్కలు తీసుకో” అని అదేశించాడు.

2 అప్పుడు రాజు తనతో ఉన్న సైన్యాధిపతి యోవాబుకు “యుద్దానికి పోగల మనుషులు ఎంత మంది ఉన్నారో నాకు తెలియాలి. దాను మొదలు బెయేర్షెబా దాకా తిరిగిచూసి, ఇశ్రాయేలు గోత్రాల్లో ఉన్న వారిని లెక్కించు” అని ఆజ్ఞాపించాడు.

3 అందుకు యోవాబు “నా ప్రభువు, రాజు అయిన నువ్వు చూస్తుండగానే యెహోవా ఈ జనాభాను నూరంతలు ఎక్కువ చేయు గాక. నా ప్రభువు, రాజు అయిన నీకు ఇలా చేయాలని ఎందుకు అనిపించింది?” అన్నాడు.

4 అయినప్పటికీ రాజు యోవాబుకు సైన్యాధిపతులకు ఇచ్చిన ఆజ్ఞ తిరుగులేనిది గనక యోవాబు, సైన్యాధిపతులు ఇశ్రాయేలీయుల జన సంఖ్య చూడడానికి రాజు సముఖం నుండి బయలు దేరారు.

5 వారు యొర్దాను నది దాటి లోయలో ఉన్న పట్టణానికి దక్షిణంగా అరోయేరు దగ్గర మకాం వేశారు. ఆపైన వారు గాదు ప్రాంతం గుండా యాజేరు చేరుకున్నారు.

6 అక్కడ నుండి గిలాదుకు, తహ్తింహోద్షీ ప్రాంతానికి వచ్చారు. తరువాత దానాయాను మీదుగా సీదోనుకు వచ్చారు.

7 అక్కడ నుండి కోటలు ఉన్న తూరు పట్టణానికీ, హివ్వీయుల, కనానీయుల పట్టణాలకూ చేరుకున్నారు. యూదా దేశానికి దక్షిణ దిక్కున ఉన్న బెయేర్షెబా వరకూ సంచరించారు.

8 ఈ విధంగా వారు దేశమంతా సంచరించి తొమ్మిది నెలల ఇరవై రోజులకు తిరిగి యెరూషలేము చేరారు.

9 అప్పుడు యోవాబు యుద్ధం చేయగల వారి మొత్తం లెక్క రాజుకు తెలియపరిచాడు. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షలమంది యోధులు ఉన్నారు. యూదావారిలో 5 లక్షలమంది ఉన్నారు.

10 జనసంఖ్య చూసినందుకు దావీదు మనస్సు నొచ్చుకుంది. అతడు యెహోవాతో “నేను చేసిన పని వలన గొప్ప పాపం మూటగట్టుకున్నాను. ఇలా చేయడం చాలా పెద్ద పాపం. యెహోవా, నేను చాలా తెలివి తక్కువ పని చేశాను. దయచేసి నీ దాసుడి దోషం తీసివెయ్యి” అన్నాడు.

11 తెల్లవారి, దావీదు నిద్ర లేచినప్పుడు దావీదుకు దీర్ఘ దర్శి, ప్రవక్త అయిన గాదుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై,

12 “నీవు పోయి దావీదుతో ఇలా చెప్పు. ‘మూడు విషయాలు నీ ముందుంచుతున్నాను. వాటిలో ఒకటి కోరుకో. దాన్ని నీపైకి రప్పిస్తాను.’”

13 కాబట్టి గాదు దావీదు దగ్గరికి వచ్చి సంగతి తెలిపాడు. “నీవు నీ దేశంలో మూడేళ్ళు కరువు కలగడం కోరుకుంటావా, నీ శత్రువు నిన్ను తరుముతుంటే మూడునెలల పాటు పారిపోడానికి ఒప్పుకుంటావా, లేక నీ దేశంలో మూడు రోజులు తెగులు చెలరేగడానికి ఒప్పుకొంటావా? ఈ విషయం ఆలోచించి నన్ను పంపిన దేవునికి ఏమి జవాబు చెప్పాలో నిర్ణయించు” అన్నాడు.

14 అందుకు దావీదు “గొప్ప చిక్కులో పడ్డాను. యెహోవా కరుణా సంపన్నుడు గనక మనుషుల చేతిలో పడడం కంటే యెహోవా చేతిలోనే పడదాము” అని గాదుతో అన్నాడు.

15 కాబట్టి యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి ఘోర వ్యాధి రప్పించాడు. ఉదయం మొదలుకుని నియామక కాలం వరకూ అది చెలరేగింది. ఫలితంగా దాను నుండి బెయేర్షెబా వరకూ 70 వేలమంది మరణించారు.

16 దూత యెరూషలేమును నాశనం చెయ్యడానికి తన చెయ్యి చాపగా, యెహోవా ఆ అరిష్టం విషయం పరితపించాడు. ఆయన నాశన దూతకు “ఇక చాలు, నీ చెయ్యి వెనక్కి తీసుకో” అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ సమయంలో యెహోవా దూత యెబూసీయుడైన అరౌనాకు చెందిన కళ్ళం దగ్గర ఉన్నాడు.

17 ప్రజలను నాశనం చేసిన ఆ దూతను చూసి దావీదు యెహోవాను ఇలా ప్రార్థించాడు. “పాపం చేసిన వాణ్ని నేను గదా. దుర్మార్గంగా ప్రవర్తించిన వాణ్ని నేను గదా. గొర్రెలవంటి ఈ ప్రజలేమి చేసారు? నన్నూ నా తండ్రి కుటుంబాన్నీ శిక్షించు.”

18 ఆ రోజున గాదు దావీదు దగ్గరికి వచ్చి “నీవు వెళ్లి యెబూసీయుడైన అరౌనా కళ్ళంలో యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించు” అని అతనితో చెప్పాడు.

19 దావీదు గాదు ద్వారా యెహోవా యిచ్చిన ఆజ్ఞ ప్రకారం బయలు దేరాడు.

20 రాజు, అతని పరివారం తనవైపు రావడం అరౌనా చూసి ఎదురు వెళ్లి రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి “నా యజమానీ, రాజూ అయిన నీవు నీ దాసుడైన నా దగ్గరికి వచ్చిన కారణమేమిటి?” అని అడిగాడు.

21 దావీదు “ఈ కళ్ళం నీ దగ్గర కొని యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించాలని వచ్చాను. అ విధంగా ఈ తెగులు ప్రజలనుండి తొలిగి పోతుంది” అన్నాడు.

22 అందుకు అరౌనా “నా యజమానీ రాజు అయిన నీవు నీకు ఏది కావాలో తీసుకో. నీకు అనుకూలమైనదేమిటో అది చెయ్యి. ఇదుగో, దహనబలి కోసం ఎడ్లు ఉన్నాయి. కట్టెలుగా ఈ నూర్చే కర్ర వస్తువులూ, ఎడ్ల కాడి పనికొస్తాయి.

23 రాజా, యివన్నీ అరౌనా అనే నేను, రాజుకు ఇస్తున్నాను” అన్నాడు. “నీ దేవుడైన యెహోవా నీ మనవి వినుగాక” అని రాజుతో అన్నాడు.

24 రాజు “నేను అలా తీసుకోను, ఖరీదు ఇచ్చి నీ దగ్గర కొంటాను. వెల ఇవ్వకుండా తీసుకున్న దాన్ని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించను” అని అరౌనాతో చెప్పి ఆ కళ్ళాన్నీ ఎడ్లనూ 50 తులాల వెండి ఇచ్చి కొన్నాడు.

25 అక్కడ దావీదు యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించాడు. దేశం కోసం చేసిన ఆ విన్నపాలను యెహోవా అంగీకరించగా ఇశ్రాయేలీయులకు దాపురించిన ఆ తెగులు ఆగిపోయింది.