2 Samuel 17 in Telugu

1 అహీతోపెలు అబ్షాలోముతో ఇలా చెప్పాడు “దావీదు బాగా అలసిపోయి బలహీనంగా ఉన్నాడు.

2 నేను అతనిపై దాడిచేసి అతణ్ణి బెదిరిస్తాను. అప్పుడు అతని దగ్గర ఉన్నవారంతా పారిపోతారు. అప్పుడు రాజును మాత్రం చంపివేసి ప్రజలందరినీ నీవైపు తిప్పుతాను. నువ్వు వెతుకుతున్న వ్యక్తిని నేను పట్టుకున్నప్పుడు ప్రజలంతా నీతో రాజీ పడిపోతారు. కాబట్టి నీకు అంగీకారమైతే నాకు 12,000 మంది సైన్యాన్ని సిద్ధం చేయించు. ఈ రాత్రే దావీదును తరిమి పట్టుకుంటాను” అన్నాడు.

4 ఈ మాటలు అబ్షాలోముకు, ఇశ్రాయేలు పెద్దలందరికీ మంచిగా అనిపించాయి.

5 అప్పుడు అబ్షాలోము “ఈ విషయంలో అర్కీయుడైన హూషై ఏమి చెబుతాడో విందాం. అతణ్ణి పిలిపించండి” అని ఆజ్ఞాపించాడు. హూషై అబ్షాలోము దగ్గరికి వచ్చాడు.

6 అబ్షాలోము అహీతోపెలు చెప్పిన పథకం అతనికి తెలియజేశాడు. “అతడు చెప్పినట్టు చేయడం మంచిదా, కాదా? నీ ఆలోచన ఏమిటో చెప్పు” అని అడిగాడు.

7 హూషై అబ్షాలోముతో ఇలా అన్నాడు. “ఇప్పుడు అహీతోపెలు చెప్పిన ప్రణాళిక మంచిది కాదు.

8 నీ తండ్రి, అతనితో ఉన్నవారు మహా బలమైన యుద్ధ వీరులు. అడవిలో తమ పిల్లలను పోగొట్టుకొన్న ఎలుగుబంటులను పోలినవారై రగిలిపోతూ ఉన్నారని నీకు తెలుసు. నీ తండ్రి యుద్ధవిద్యలో నేర్పరి. అదీకాక అతడు తన మనుషులతో కలసి బసచేయడు.

9 ఆతడు ఏదో ఒక గుహలోనో, లేకపోతే ఏదైనా రహస్య స్థలం లోనో దాక్కుంటాడు. యుద్ధం ఆరంభంలో నీ మనుషులు కొందరు చనిపోతే ప్రజలు వెంటనే దాన్నిబట్టి అబ్షాలోము మనుషులు ఓడిపోయారని చెప్పుకుంటారు.

10 నీ తండ్రి గొప్ప బలవంతుడని, అతని మనుషులు అత్యంత ధైర్యవంతులని ఇశ్రాయేలీయులందరికీ తెలుసు. అందువల్ల సింహాలవంటి పౌరుషం గలవారు కూడా భీతిల్లిపోతారు.

11 నా ఆలోచన ఏమిటంటే, దాను నుండి బెయేర్షెబా వరకూ సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా ఇశ్రాయేలీయులనందరినీ నాలుగు దిక్కులకు సమకూర్చుకుని నువ్వే స్వయంగా యుద్ధానికి బయలుదేరు.

12 అప్పుడు అతడు ఎక్కడ కనబడితే అక్కడ మనం అతనిపై దాడి చేయవచ్చు. మంచు నేల మీద ఎలా పడుతుందో ఆ విధంగా మనం అతనిమీద పడితే అతని మనుషుల్లో ఒక్కడు కూడా తప్పించుకోలేడు.

13 అతడు గనుక ఒక పట్టణం వెనుక దాక్కొంటే ఇశ్రాయేలీయులంతా ఆ పట్టణాన్ని తాళ్లు తీసుకుని ఒక చిన్న రాయి కూడా కనబడకుండా దాన్ని నదిలోకి లాగుతారు.”

14 అబ్షాలోము, ఇశ్రాయేలువారు ఈ మాట విని అర్కీయుడైన హూషై చెప్పిన మాట అహీతోపెలు చెప్పినదానికంటే యోగ్యమైనదని ఒప్పుకున్నారు. ఎందుకంటే యెహోవా అబ్షాలోము మీదికి విపత్తు రప్పించాలని అహీతోపెలు చెప్పిన తెలివైన ప్రణాళిక నిరర్ధకమయ్యేలా చేయాలని నిశ్చయించుకున్నాడు.

15 అప్పుడు హూషై, అబ్షాలోము, ఇశ్రాయేలు పెద్దలకందరికీ అహీతోపెలు వేసిన పథకం, తాను చెప్పిన ఆలోచన యాజకులైన సాదోకు, అబ్యాతారులకు తెలియజేశాడు.

16 “మీరు తొందరగా వెళ్లి, రాజు, అతని దగ్గర ఉన్న మనుషులంతా హతం కాకుండా ఉండేలా దావీదుకు ఈ విషయం చెప్పండి. మీరు ఈ రాత్రి అరణ్యంలో నది తీరం దాటే స్థలాల్లో ఉండవద్దు” అని చెప్పాడు.

17 యోనాతాను, అహిమయస్సు తాము పట్టణం హద్దుకు వచ్చిన సంగతి ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఏన్‌రోగేలు దగ్గెర నిలిబడి ఉన్నప్పుడు ఒక పనిమనిషి వచ్చి, హూషై చెప్పిన సంగతి వారికి చెప్పినప్పుడు వారు వెళ్లి రాజైన దావీదుకు ఆ సంగతి చెప్పారు.

18 వారిద్దరినీ అక్కడ చూసిన ఒక పనివాడు అబ్షాలోముకు చెప్పాడు. వారిద్దరూ వెంటనే పరుగెత్తి వెళ్లి బహూరీములో ఒకడి ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంటి ముందు ఉన్న ఒక బావిలో దిగి దాక్కున్నారు.

19 ఆ ఇంటి ఇల్లాలు ఒక పరదా తీసుకువచ్చి బావిమీద పరిచి, దానిపైన గోదుమపిండి ఆరబోసింది. కనుక వారు బావిలో ఉన్న సంగతి ఎవ్వరికీ తెలియలేదు.

20 అబ్షాలోము సేవకులు ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. అహిమయస్సు, యోనాతాను ఎక్కడ ఉన్నారని అడిగారు. ఆమె “వారు నది దాటి వెళ్లిపోయారు” అని చెప్పింది. వారు వెళ్లి చుట్టుపక్కల అంతా వెతికి వారు కనబడకపోయే సరికి యెరూషలేముకు తిరిగి వచ్చారు.

21 సేవకులు వెళ్లిపోయిన తరువాత యోనాతాను, అహిమయస్సు బావిలో నుండి బయటికి వచ్చి దావీదు దగ్గరికి వెళ్లి. అహీతోపెలు అతని మీద వేసిన పథకం గురించి చెప్పి “నువ్వు లేచి త్వరగా నది దాటు” అని చెప్పారు.

22 దావీదు, అతని దగ్గర ఉన్న మనుషులంతా లేచి యొర్దాను నది దాటారు. తెల్లవారేసరికి ఒక్కడు కూడా మిగలకుండా అందరూ నది దాటి వెళ్ళిపోయారు.

23 అహీతోపెలు తాను చెప్పిన పథకం అమలు కాకపోవడం చూసి, గాడిదకు గంతలు కట్టి ఎక్కి తన ఊరికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్లి, ఇంటి విషయాలు చక్కబెట్టి ఉరి వేసుకుని చనిపోయాడు. అతని తండ్రి సమాధిలో అతన్ని పాతిపెట్టారు.

24 దావీదు మహనయీముకు చేరేటప్పటికి అబ్షాలోము, ఇశ్రాయేలీయులంతా యొర్దాను నది దాటి వచ్చారు.

25 అబ్షాలోము యోవాబును తొలగించి అమాశాను సైన్యాధిపతిగా నియమించుకున్నాడు. అమాశా తండ్రి ఇత్రా, ఇశ్రాయేలీయుడు. యోవాబు తల్లి సెరూయా సహోదరియైన నాహాషు కుమార్తెకు, అబీగయీలుకు ఇత్రా పుట్టాడు.

26 అబ్షాలోము, ఇశ్రాయేలీయులు గిలాదు దేశంలో మకాం వేశారు.

27 దావీదు మహనయీముకు చేరుకున్నప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణ వాస్త్యవ్యుడు, నాహాషు కొడుకు షోబీయు, లోదెబారు ఊరివాడు అమ్మీయేలు కొడుకు మాకీరు, రోగెలీము ఊరికి చెందిన గిలాదీయుడు బర్జిల్లయి

28 ఎడారిలో దావీదు, అతని మనుషులు అలసిపోయి, ఆకలి దాహంతో ఉంటారని గ్రహించి, పరుపులు, వంటపాత్రలు, కుండలు, వారంతా తినడం కోసం గోదుమలు, యవల పిండి, పప్పులు, చిక్కుడు కాయలు, పేలాలు,

29 తేనె, వెన్న, గొర్రెలు, జున్నుముద్దలు తీసుకువచ్చారు.