1 Samuel 2 in Telugu

1 హన్నా ప్రార్థన చేస్తూ ఇలా అంది, “నా హృదయం యెహోవాలో సంతోషిస్తూ ఉంది. యెహోవాలో నాకు ఎంతో బలం కలిగింది. నీ ద్వారా కలిగిన రక్షణనుబట్టి సంతోషిస్తున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడతాను.

2 యెహోవా లాంటి పరిశుద్ధ దేవుడు ఎవరూ లేరు. నువ్వు కాకుండా ఇంక ఏ దేవుడూ లేడు మన దేవుడిలాంటి ఆశ్రయం ఎక్కడా లేదు.

3 యెహోవా దేవుని జ్ఞానం అనంతమైంది. మన కార్యాలను పరిశీలించేవాడు ఆయనే. కాబట్టి ఇకపై ఎవరూ గర్వంగా మాట్లాడవద్దు. అహంకారమైన మాటలు మీ నోటనుంచి రానియ్యవద్దు.

4 పేరుగాంచిన విలుకాళ్ళు ఓడిపోతారు. తొట్రిల్లి పడిపోయినవారు బలం పొందుతారు.

5 తృప్తిగా భోజనం చేసినవారు అన్నం కోసం కూలి పనికి వెళ్తారు. ఆకలి వేసినవారు కడుపునిండా తింటారు. గొడ్రాలు ఏడుగురు పిల్లలను కంటుంది. ఎక్కువమంది పిల్లలను కనిన స్త్రీ కృశించిపోతుంది.

6 మనుషులను సజీవులుగానూ, మృతులుగానూ చేసేవాడు యెహోవాయే. పాతాళానికి పంపిస్తూ అక్కడినుండి రప్పించే వాడూ ఆయనే.

7 యెహోవా దరిద్రతను, ఐశ్వర్యాన్ని కలుగ జేసేవాడు. కుంగిపోయేలా చేసేవాడూ, లేవనెత్తేవాడూ ఆయనే.

8 దరిద్రులను అధికారులతో కలసి కూర్చోబెట్టేవాడూ, మహిమగల సింహాసనంపై కూర్చునేలా చేసేవాడూ వారిని మట్టిలోనుండి పైకి ఎత్తే వాడు ఆయనే. పేదవారిని పెంటకుప్పపై నుండి పైకి లేపేవాడు ఆయనే. భూమి ఆధార స్తంభాలు యెహోవా ఆధీనంలో ఉన్నాయి. ఆయన లోకాన్ని వాటిపై నిలిపి ఉంచాడు.

9 తన భక్తుల పాదాలు తొట్రుపడకుండా ఆయన వారిని కాపాడతాడు. దుర్మార్గులు చీకటిలో దాక్కొంటారు. బలం వలన ఎవరూ విజయం సాధించలేరు.

10 యెహోవాతో వాదులాడేవారు నాశనమైపోతారు. పరలోకం నుండి ఆయన వారి మీద ఉరుములాగా గర్జిస్తాడు. భూదిగంతాల ప్రజలకు ఆయన తీర్పు తీరుస్తాడు. తాను నిలబెట్టిన రాజుకు ఆయన బలమిస్తాడు. తాను అభిషేకించినవాడికి అధికమైన బలం కలిగిస్తాడు.”

11 తరువాత ఎల్కానా రమాలోని తన ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ఆ పిల్లవాడు యాజకుడైన ఏలీ సమక్షంలో యెహోవాకు సేవ చేస్తున్నాడు.

12 ఏలీ కుమారులు యెహోవా మార్గాలు తెలియని దుర్మార్గులు.

13 ప్రజల విషయంలో యాజకులు చేస్తున్న పని ఏమిటంటే, ఎవరైనా బలిగా అర్పించిన తరువాత మాంసం ఉడుకుతూ ఉన్నపుడు యాజకుని మనుషులు మూడుముళ్ళు ఉన్న కొంకిని తీసుకు వచ్చి

14 డేక్సాలో గాని తపేలాలో గాని గుండిగలో గాని కుండలో గాని గుచ్చినపుడు ఆ కొంకికి గుచ్చుకుని బయటకు వచ్చేదంతా యాజకుడు తన కోసం తీసుకొంటాడు. షిలోహుకు వచ్చే ఇశ్రాయేలీయులు అందరికీ వీరు ఇలాగే చేస్తూ వచ్చారు.

15 అంతేకాక, వారు కొవ్వును దహించక ముందు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించేవాడితో “యాజకుని కోసం వండడానికి మాంసం ఇవ్వు. ఉడకబెట్టిన మాంసం అతడు తీసుకోడు, పచ్చిమాంసమే కావాలి” అనేవాడు.

16 “అలా కాదు, ముందు కొవ్వును దహించాలి, తరువాత నీకు కావలసినంత తీసికోవచ్చు” అని అతనితో చెబితే, వాడు “అలా వద్దు, ఇప్పుడే ఇవ్వాలి, లేకపోతే బలవంతంగా తీసుకుంటాం” అనేవాడు.

17 అందువల్ల ప్రజలు యెహోవాకు నైవేద్యం అర్పించడం మానివేసి దాని విషయం అసహ్యపడడానికి ఆ యువకులు కారణమయ్యారు. కాబట్టి వారు చేస్తున్న పాపం యెహోవా దృష్టికి మితి మీరింది.

18 బాల సమూయేలు నారతో నేసిన ఏఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు.

19 అతని తల్లి అతనికి చిన్న అంగీ ఒకటి కుట్టి ప్రతి సంవత్సరం బలి అర్పించడానికి తన భర్తతో కలసి వచ్చినప్పుడు దాన్ని తెచ్చి అతనికి ఇస్తూ వచ్చింది.

20 “యెహోవా సన్నిధిలో వేడుకొన్నప్పుడు నీకు కలిగిన ఈ సంతానానికి బదులుగా యెహోవా నీకు మరెక్కువ సంతానం ఇస్తాడు” అని ఏలీ ఎల్కానాను, అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళారు.

21 యెహోవా హన్నాకు మళ్లీ సహాయం చేయగా ఆమె మళ్లీ గర్భం దాల్చి ముగ్గురు కొడుకులను, ఇద్దరు కూతుళ్ళను కన్నది. అయితే బాల సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి పెరుగుతూ ఉన్నాడు.

22 ఏలీ చాలా ముసలివాడయ్యాడు. ఇశ్రాయేలీయుల పట్ల తన కొడుకులు చేసిన పనులన్నిటి విషయం, వారు ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గర సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచరిస్తున్నారు అనే విషయం విన్నప్పుడు వారిని పిలిచి ఇలా అన్నాడు,

23 “ఈ ప్రజల ముందు మీరు చేస్తున్న చెడ్డ పనులు నాకు తెలిశాయి. ఇలాటి పనులు మీరెందుకు చేస్తున్నారు?

24 నా కుమారులారా, ఇలా చేయవద్దు. నేను విన్నది మంచిది కాదు. మీరు యెహోవా ప్రజల చేత పాపం చేయిస్తున్నారు.

25 మనిషి పట్ల మనిషి తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు. అయితే ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేస్తే అతని కోసం ఎవడు వేడుకుంటాడు?” అయితే యెహోవా వారిని చంపాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి వారు తమ తండ్రి చెప్పిన మాటలు వినలేదు.

26 బాల సమూయేలు యెహోవాకూ, మనుష్యులకూ ఇష్టమైనవాడుగా పెరుగుతూ ఉన్నాడు.

27 ఆ సమయంలో దేవుని మనిషి ఒకడు ఏలీ దగ్గరకి వచ్చి ఇలా చెప్పాడు. “యెహోవా నిన్ను గూర్చి చెబుతున్నది ఏమిటంటే, ‘నీ పూర్వికులు ఐగుప్తు దేశంలో ఫరో కింద బానిసత్వంలో ఉన్నప్పుడు నేను వారికి ప్రత్యక్షమయ్యాను.

28 అతడు నా సన్నిధానంలో ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణ, ధూపం అర్పించడానికి నాకు యాజకుడుగా ఉండేందుకు ఇశ్రాయేలు గోత్రాల్లో నుండి నేను అతణ్ణి ఏర్పరచుకొన్నాను. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పూర్వికుని ఇంటివారికి ఇచ్చాను.

29 నా సన్నిధి ఉండే స్థలానికి నేను నిర్ణయించిన బలి నైవేద్యాలను మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారు? మిమ్మల్ని మీరు కొవ్వబెట్టుకోడానికి నా ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసే నైవేద్యాల్లో శ్రేష్ఠమైన భాగాలను మీరే ఉంచుకొంటూ నాకంటే నీ కొడుకులను నీవు గొప్ప చేస్తున్నావు.

30 నీ ఇంటివారు, నీ పూర్వికుని ఇంటివారు నా సన్నిధిలో యాజకత్వం జరిగిస్తారని నేను వాగ్దానం చేశాను. కానీ ఇప్పుడు అలా కొనసాగించడం నాకు దూరం అగు గాక.’ అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి యెహోవా మాట ఏమిటంటే, ‘నన్ను గొప్ప చేసేవారిని నేను గొప్పచేస్తాను. నన్ను తిరస్కరించేవారిని తోసిపుచ్చుతాను.’

31 జాగ్రత్తగా వినండి, రాబోయే రోజుల్లో నీ బలాన్ని, నీ పూర్వికుని ఇంటి బలాన్ని నేను తగ్గిస్తాను. నీ ఇంటి మొత్తంలో ముసలివాడు ఒకడు కూడా ఉండడు.

32 నా సన్నిధి స్థలానికి అపాయం సంభవించడం నువ్వు చూస్తావు. యెహోవా ఇశ్రాయేలీయుల కోసం చేయాలనుకొన్న మేలు జరిగిస్తాడు గానీ నీ ఇంట్లో మాత్రం వృద్ధుడు ఎవడూ ఉండడు,

33 నా బలిపీఠం దగ్గర ఎవరూ లేకుండా నేను అందరినీ నాశనం చేయకుండా విడిచిపెట్టేవాడిని కాదు. కాబట్టి అది నీ కళ్ళు మసకబారడానికి, నువ్వు దుఃఖంతో క్షీణించిపోడానికి కారణమౌతుంది. నీ సంతానమంతా ముసలివాళ్ళు కాకముందే చనిపోతారు.

34 నీ ఇద్దరు కొడుకులైన హొఫ్నీకీ, ఫీనెహాసుకూ ఇలా జరుగుతుందని నేను చెప్పిన దానికి నీకు ఒక సూచన, ఒక్కరోజే వారిద్దరూ చనిపోతారు.

35 తరువాత నమ్మకమైన ఒక యాజకుణ్ణి నేను నియమిస్తాను. అతడు నా ఆలోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగిస్తాడు. అతనికి నేను నమ్మకమైన సంతానం అనుగ్రహిస్తాను. అతడు నా అభిషిక్తుని సన్నిధిలో సదాకాలం యాజకత్వం జరిగిస్తాడు.

36 అయితే నీ ఇంటివారిలో మిగిలిన ప్రతి ఒక్కరూ డబ్బుకోసం రొట్టెల కోసం అతని దగ్గరికి వచ్చి వంగి నమస్కరించి, ‘నేను కడుపుకు రొట్టెముక్క తినగలిగేలా దయచేసి యాజకుల సేవల్లో ఒకదానిలో నన్ను పెట్టుకో’ అని అతడిని బతిమాలుకుంటారు.”